బోరబండలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: జనవరి 16 : కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ రోజు బోరబండ, అంబేడ్కర్ నగర్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం, ప్రధానమంత్రి స్వనిధి కింద అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇవి వారి సమగ్ర అభివృద్ధికి, సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి
తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కోన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర పథకాలు చేరువ చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మొదలు పెట్టారని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు పీఎం జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, పీఎం కిసాన్, పీఎం అటల్ పెన్షన్ యోజన, ముద్ర యోజన తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని బొరబండ బస్తీ వాసులు వీక్షించారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ తో పాటు ప్రభుత్వ పథకాలు పై ప్రచురించిన బ్రోచర్లను కేంద్ర మంత్రి విడుదల చేశారు.
ప్రారంభ కార్యక్రమంలో వైద్య శిబిరంతో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్, సామాజిక బీమా పథకాల జారీ చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో వివిధ పథకాలతో లబ్దిపొందిన పలువురు తమ అనుభవాలు పంచుకున్నారు. స్వయం సహాయక సంఘాలు సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వాలంటీర్లు , బొరబండ బస్తీ వాసులు..తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.