టీయూడబ్ల్యూజే వినతికి స్పందించిన మంత్రులు
కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి:ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ముగ్గురు క్యాబినెట్ మంత్రులు హామీ ఇచ్చారు. ఈరోజు కరీంనగర్ లో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి ,శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు టీయూడబ్ల్యూజే హెచ్ 143 కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తప్పకుండా త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ స్కీం,బిపిఎల్ కింద కరీంనగర్ లోని జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు ఎస్సారెస్పీకి చెందినవి కావడంతో ఎన్ఓసి సమస్యతో సహా ఇతర ఇబ్బందుల కారణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని, అలాగే గతంలో స్థలాలు పొందని అర్హులైన జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తమ వినతి పత్రంలో మంత్రులను కోరారు. సమాజంలో సత్యాన్ని వెలికి తీసే జర్నలిస్టులు తమ కుటుంబాలకు స్థిరమైన గృహం కోసం ఎదురుచూస్తున్నారని, మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే నాయకులు రిషికేష్, తదితరులు పాల్గొన్నారు