ఉప్పల్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, జనవరి 28: గ్రేటర్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఫోకస్ పెట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడిరచారు. మంగళవారం ఉప్పల్ సర్కిల్ చిలుకా నగర్ వార్డు లో సుమారు రెండు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మోడల్ గ్రేవ్ యార్డ్ ను డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ లతో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం చిలుకా నగర్ లోని పలు కాలనీల సమస్యల పై కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ వివరించగా వాటిని డిప్యూటీ మేయర్, అధికారులతో కలిసి సమస్యలను పరిశీలన చేసిన మేయర్ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మేయర్ పిస్తా హౌస్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి తో పాటు అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు కాలనీలో ఓపెన్ డ్రైనేజీ స్థానంలో బాక్స్ డ్రైనేజీ పనులకు అంచనా ప్రాతిపదికకు అనుగుణంగా నిధులు మంజూరు కాలేదని, ఇంతకు ముందు ప్రతిపాదించిన అంచనా మేరకు నిధులు మంజూరు చేయాలని కార్పొరేటర్ కోరగా, అవసరమైన నిధుల మంజూరుకు నివేదిక పంపాలని జోనల్ ఎస్.ఈ ని మేయర్ ఆదేశించారు.
చిలుకా నగర్ మెయిన్ రోడ్డు పోచమ్మ టెంపుల్ చౌరస్తా వద్ద బోడుప్పల్ మున్సిపాలిటీ నుండి స్ట్రామ్ వాటర్ డ్రైన్, ఇండస్ట్రియల్ స్ట్రామ్ వాటర్ ఓవర్ ఫ్లో నీరు కాలనీలోకి రావడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ వివరించి, ప్రధాన ట్యాంక్ లైన్ నిర్మాణం చేపట్టాలని కోరగా, మేయర్ పరిశీలన చేసి వాటర్ వర్క్స్ ఎండి తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. నాచారం చెరువు మత్తడి నుండి ఓవర్ ఫ్లో తో కాలనీలోకి చెరువు నీరు రావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు మల్లికార్జున్ నగర్ కాలనీవాసులు మేయర్ కు విన్నవించగా వరద నివారణకు చర్యలు తీసుకోవాలని జోనల్ ఎస్ ఈ ని ఆదేశించారు.
అజాం పూర్ అలకపూరి నార్త్ కాలని వద్ద పార్కు అభివృద్ధి కి చర్యలు తీసుకుంటామని ఓపెన్ జిమ్ ఏర్పాటు తో పాటుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు. మిస్టాట్ ఎన్ క్లేవ్ నాలా క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గతంలో ఉన్న క్రాసింగ్ బ్రిడ్జి వరద నీరు నిలిచి దెబ్బతిన్న నేపథ్యంలో ఎత్తయిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు కోరారు. ఇందిరా నగర్ ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం తొలగించి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
మేయర్ వెంట డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ ఎస్ ఈ నిత్యానంద, ఉప్పల్ సర్కిల్ డి సి ఆంజనేయులు, జోనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.