పార్టీలు మారడం దుస్తులు మార్చుకున్నంత సులువు కాదు
సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోంద
భాజపా అధిష్ఠానం పిలిస్తేనే దిల్లీకి వెళ్లాను
భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్ జూన్ 27 (;: సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘భాజపా నేతలతో ఫొటో దిగితే బీసీ బంధు, దళితబంధు, ప్రభుత్వ పథకాలు అందవని భారాస నేతలు బెదిరిస్తున్నారు. సంక్షేమ పథకాలు రావనే భయంతో బయటకు చెప్పకపోవచ్చు గానీ.. మరోసారి కేసీఆర్ గెలిస్తే మన బతుకులు ఆగమేనని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎదర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. స్వేచ్ఛ ఉంటే తన తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే సచివాలయంలోకి ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు 6 నెలల సమయం ఉంది. తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో భాజపా ముందుకెళ్తోంది. తప్పకుండా తెలంగాణలో భాజపా విజయం సాధిస్తుంది.జాగ్రత్తగా ఉండాలని కొన్ని నెలలుగా నన్ను బెదిరిస్తున్నారు. నయీమ్కే భయపడలేదు, ఈ బెదిరింపులకు భయపడతానా? పార్టీలు మారడం దుస్తులు మార్చుకున్నంత సులువు కాదు. భారాస నుంచి నేను బయటకు రాలేదు, గెంటేస్తే వచ్చాను. నాకు నేనుగా పార్టీ మారలేదు. నన్ను బయటకు పంపించినప్పుడు కేసీఆర్ కుటుంబీకులు బాధపడి ఉంటారు. జాతీయ రాజకీయాలు నాకు కొత్త . నాకు నేనుగా దిల్లీకి వెళ్లలేదు, అపాయింట్మెంట్ కోరలేదు. భాజపా అధిష్ఠానం పిలిస్తేనే దిల్లీకి వెళ్లాను. భారాసను కొట్టేది భాజపానే’’ అని ఈటల రాజేందర్ అన్నారు.